తాజా వార్తాలు / అమరావతి : కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయంటూ వెల్లడించారు. ఒంగోలులో గురువారం మీడియాతో మాట్లాడిన గిడుగు రుద్రరాజు.. పార్టీ బలోపేతం, తదితర అంశాల గురించి పలు వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై రుద్రరాజు విరుచుకుపడ్డారు. సీఎం జగన్ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని.. అక్రమాలు, అత్యాచారాలు పెరిగాయంటూ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై జనం విసిగిపోయారన్నారు.2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని.. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. ఈ దిశగా జిల్లా కమిటీలు, నాయకులను సన్నద్ధం చేసేలా జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చిరంజీవి గురించి విలేకరులు ప్రశ్నించగా.. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్లోనే ఉన్నారని, రాహుల్, సోనియా లతో ఆయనకు మంచి సంబంధాలున్నాయంటూ వివరించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని.. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ఈనెల 26 నుంచి మార్చి 26 వరకు పార్టీ కార్యకర్తలు పాదయాత్రలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే.. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారంటూ గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా, తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ పలుమార్లు చిరంజీవి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
-----------------------
Admin