తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన పొత్తు ప్రకటన తర్వాత రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ దిశగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల నుంచి ఉమ్మడి కమిటీల నియామకం జరిగింది. వైఎస్సార్సీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని రెండు పార్టీలు ప్రకటించాయి. అయితే రాజమండ్రిలో మొదటిసారి సమావేశమైన ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో ముందుగా రెండు పార్టీల భాగస్వామ్యంపై ఫోకస్ పెట్టాయి. క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల కేడర్ మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా ముందుకు సాగేలా చర్యలు చేపట్టాయి. దీంతోపాటు ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు కూడా పూర్తయ్యాయి. అన్ని జిల్లాల్లో తెలుగుదేశం-జనసేన కలిసి సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసుకున్నాయి. చిన్నచిన్న విభేదాలు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఇలా రెండు పార్టీల మధ్య పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఆందోళనలకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించాయి.అయితే ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి..? ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై చర్చించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. దీనికంటే ముందుగానే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని కూడా రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. నవంబర్ ఒకటో తేదీన విడుదల చేయాలనుకున్న ఉమ్మడి మేనిఫెస్టో, నవంబర్ మూడో తేదీన నిర్వహించాలనుకున్న ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం కూడా వాయిదా పడ్డాయి. అయితే చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం, వైద్య పరీక్షల కోసం హైదరాబాద్కు వెళ్లారు. మరోవైపు ఇటలీ నుంచి తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. దీంతో కేవలం పరామర్శ మాత్రమే కాకుండా రాజకీయపరమైన చర్చ కూడా జరిగినట్లు ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి.పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఇద్దరూ చంద్రబాబు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
-----------------------
Admin