తాజా వార్తాలు / అమరావతి : టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. యువగళం యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. లేఖలు రాసినా ఇప్పటి వరకూ అనుమతి రాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా పాదయాత్ర జరిగి తీరుతుందని స్పష్టం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. పాదయాత్రకు అనుమతులు అవసరం లేదంటూ గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనలను టీడీపీ నేతలు బయట పెడుతున్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మూడున్నరేళ్లుగా ఓ సైకో పై పోరాడుతున్నామని, తెలుగుదేశం పార్టీకి అధికారం, ప్రతిపక్షం కొత్త కాదని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత సైకో పాలన చూడలేదని ఫైర్ అయ్యారు. ప్రజలంతా ఎన్నో ఆశలతో జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చారని, కానీ ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని లోకేశ్ తెలిపారు.కార్యకర్తలు, నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. కార్యకర్తలు, నాయకులే టీడీపీకి బలం. మేం అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డిలా చేసుంటే వైసీపీ ఉండేది కాదు. 151 సీట్లు ప్రజలు ఇచ్చినందుకు ఎన్నో గొప్ప పనులు చెయ్యొచ్చన్నారు. కానీ జగన్ రెడ్డి కేవలం కక్ష సాధింపు కోసమే అధికారాన్ని వాడుకుంటున్నారు. నేను ప్రజా సమస్యల పై పోరాటం చేసేందుకు యాత్ర చేస్తున్నా. మీ అందరికి ఆశీస్సులతో త్వరలో యువగళం పాదయాత్ర చేపట్టబోతున్నానన్నాను.కాగా.. జనవరి 27 న కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టనున్న లోకేశ్.. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు రాష్ట్రంలో పర్యటించేలా కార్యాచరణ రూపొందించారు. ప్రతీ నియోజకవర్గంలో 3 రోజుల పాటు, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో నెలరోజుల పాటు పాదయాత్ర సాగనుంది. చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం, కర్నూలు, కడపల మీదుగా రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసి నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా కోస్తా జిల్లాల్లోకి యువగళం పాదయాత్ర ప్రవేశిస్తుంది. 26వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాత్రికి కుప్పం చేరుకుంటారు.
-----------------------
Admin