తాజా వార్తాలు / హైదరబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను టీఎస్ఆర్టీసీకి సరఫరా చేయనుంది. ఈ ఆర్డర్ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదని ఓజీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ కేవీ. ప్రదీప్ తెలిపారు. ఎయిర్ కండీషన్డ్ ఇంటర్సిటీ కోచ్ ఎలక్ట్రిక్ బస్సులు మహానగరాలైన హైదరాబాద్, విజయవాడ మధ్య తిరుగుతాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.ఇంట్రాసిటీ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ నగర పరిధిలో తిరుగుతాయి. వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఇవి పర్యావరణానికి తోడ్పటమే కాకుండా, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందిస్తాయి. ఒలెక్ట్రాకు టీఎస్ఆర్టీసీ ఈ-బస్సుల ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ.. “పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తాము మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించాము. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 3,400 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నాము.” అని తెలిపారు.
-----------------------
Admin