తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం: సానుకూల దృక్పధమే సమాజ ప్రగతికి సంకేతం కాగలదని ఏపిడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రం మౌంట్ అబులో నేషనల్ మీడియా కాన్ఫరెన్స్ ఐదు రోజుల శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా హాజరైన కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ సానుకూల దృక్పథంతో పనిచేసే వ్యవస్థలు, వ్యక్తులు సమాజాన్ని ముందుకు నడిపించే అవకాశం ఉంటుందన్నారు. సమస్యలను వెలికితీయడమే కాకుండా వాటి పరిష్కార మార్గాలను కూడా మీడియా అన్వేషించాలని పిలుపునిచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా విస్తరించిందని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు పరిమితులు ఉన్నా, సోషల్ మీడియాకు ఎటువంటి పరిమితులు లేవన్నారు. అయినప్పటికీ సమాజం కోసం ఆలోచించి సానుకూలంగా ముందుకు సాగాలన్నారు. ప్రజాస్వామ్య పరిపాలనా వ్యవస్థలో మీడియాకు అత్యున్నత స్థానం ఉందని, నాలుగో స్తంభంగా ఉన్న మీడియాను ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అణచివేత ధోరణితో కాకుండా వచ్చిన వార్తల్లో నిజానిజాలు తెలుసుకొని లోపాలుంటే దిద్దుకోవాలన్నారు. నిరంతరం వృత్తిలో బిజీగా ఉండే పాత్రికేయులు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ధ్యానం, యోగాలాంటి విద్యనభ్యసించి ముందుకు సాగాలన్నారు. దేశం నలుమూలల నుంచి సుమారు రెండు వేల మంది ప్రతినిధులు, ప్రింట్, ఎల క్రానిక్ మీడియా జాతీయ స్థాయి నిపుణులు, బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.
-----------------------
Admin