తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల వ్యవహారం రోజురోజుకూ ముదురుతుంది. లెక్కల్లో చూపని నగదుగా ఉన్న 118 కోట్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసారు. ఆగస్ట్ నాలుగో తేదీన హైదరాబాద్లో చంద్రబాబు నివాసం అడ్రస్తో ఈ నోటీసులు పంపించారు. ఇటీవల ఈ విషయం జాతీయ మీడియా ద్వారా బయటకు పొక్కడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు ఆయుధంగా మలుచుకుంది. మొదటి నుంచి రాజధాని విషయంలో అక్రమాలు జరిగాయని, అసైన్డ్ ల్యాండ్స్ వ్యవహారంలో కూడా భారీ స్కాం జరిగిందనేది వైసీపీ ఆరోపణ. ఇప్పటికే ఆయా కేసులకు సంబంధించి చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలపై హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. దీంతో చంద్రబాబు అవినీతి అంశంపై నోరు మెదపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఐటీ నోటీసులుపై చంద్రబాబు మౌనం వీడాలంటున్నారు వైసీపీ నేతలు.. కొంతకాలంగా ఇదే అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి మరీ చంద్రబాబు అవినీతి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే, ముడుపుల కేసులకు సంబంధించి ఐటీ నోటీసుల వ్యవహారంలో కీలకమైన మనోజ్ వాసుదేవ్ పార్దసానికి ఇతర స్కాంల్లో నిందితులకు దగ్గరి సంబంధాలున్నట్లు గుర్తించింది సీఐడి. దీంతో మనోజ్ వాసుదేవ్తో పాటు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో నిందితుడు యోగేష్ గుప్తాలకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న ఐటీ నోటీసులకు తోడు ఈ ఇద్దరికీ సిఐడీ నోటీసులు జారీ చేయడంతో చంద్రబాబుకు సమస్యలు చుట్టుకుంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తనను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చంటూ వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.
-----------------------
Admin